Wednesday, February 1, 2017

రథ సప్తమి రోజు స్నానం , పూజ , వ్రతం

📌రథ సప్తమి రోజు స్నానం , పూజ , వ్రతం.......!!

మాఘప్రశస్తి:
మా+అఘ=పాపంలేనిది - పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే. శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా - రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ - ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ  శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.
చదుకొవలిసిన స్తోత్రాలు
ఆదిత్యహృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం.
మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో వున్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటె మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానంచేయాలి.
సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగరె స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేయకుండా , విపిన బట్టలు కట్టుకుని నది స్నానం చేయకూడదు. నది స్నానకి వెళ్ళే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్త గా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీలలొ తేలుకుంటూ ముందుకు సాగి వెల్లెలాగ సూర్యోదయ సమయాన స్నానం చేయాలి.
ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా , భుజాల మీదా , మోచేతి మడతల మీద , అరచేతుల్లోనూ ( మొత్తం ఏడు) జిల్లేడు ఆకులను తలపైన ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము (ఆకు తలపై ఉంచుకుని దానిపై రేగిపండు పెట్టి తల స్నానం చేస్తూ కింది శ్లోకాన్ని చదువుకోవాలి) .
రధసప్తమినాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం
యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి.
జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన  మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక! అని దీనర్ధం. అన్నట్టు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది.
రోగ నివారణ /సంతాన ప్రాప్తి కోసం - రధ సప్తమి వ్రత విధానం
స్నానాతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదల పద్మం ముగ్గు (బియ్యం పిండి తో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి . అష్ట దళ పద్మ మద్య లో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రధాని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు
చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెస్తునామొ లేదా ఎవరికీ సంతానం కలగాలని చెస్తునామొ వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవాలి . తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని  ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా గ ఉండాలి . సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవాలి .
వ్రత కధ
పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథ సప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కధతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.
పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధ పడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి క్రాంతధర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలొ ఒకసారి ఎవరో చేస్తూ వున్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజ కుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్ధితి నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రధ సప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.
సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దానధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రధాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.
ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రధం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రధాన్ని చేయడం కనిపిస్తుంది.
ఇంటి దగ్గర పూజ , నివేదన
ఈ రోజున సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగ ప్రదేశాన్ని గోమయం తో (ఆవు పేడ) సుద్ధి చేసి గోమయం తో చేసిన పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒక దాని పై ఒకటి అమర్చి వెలిగించి, ఆ పిడకల పొయ్యిమీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి, పాలు పొంగు వస్తున్న తరుణంలో కొత్త బియ్యం,
బెల్లం అందులో వేసి చిక్కగా నివేదనకు సిద్ధం గా చెక్ర పొంగలి వండుతారు. ఈ  పరమానాని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. ఈ పొంగలి ప్రసాదం చిక్కుడు ఆకులో పెట్టి నివేదన చేస్తారు.  వితరణ కూడా చిక్కుడు అకులోనే చేస్తారు.
పాలు పొంగించడం ఆ ఇంటి వృద్ధి కి సంకేతం. ఇంకో విషయం  ఈ పర్వదినాన పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడు కాయల్ని వాడి కొబ్బరి ఆకు పుల్లల సహాయంతో రథంగా చేసి  సూర్యదేవుని రధంగా దానిని భావించి పూజ చేయాలి . (బంగారం తో అంటే ఈ కాలంలో కష్టం కదా .. )
రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుత భారతీయతకు చిహ్నము.
సప్త…. అంటే ఏడు కి చాలా విశిష్టత ఆకాశం లో ఇంద్రధనుస్సు రంగులు ఏడు, సూర్యభగవానుడి రధానికి అశ్వాలు ఏడు, సంగీతాలు స్వరాలు ఏడూ(సప్త స్వరాలు), మనకి సప్త వారాలు,( ఏడు రోజులు)సప్త ద్వీపాలు, సప్త ఋషులు,సప్త గిరులు సంగతి తెలిసిందే( ఏడు కొండలవాడు),సప్త సముద్రాలు, సప్త లోకాలు,అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఎడు ముఖ్యమైనవి అని చెబుతారు. ఆ ఏడింటి పేర్లు తెలుసునా!
మొదటి కిరణం- సుషుమ్నం
రెండవ కిరణం- హరి కేశు
మూడవ కిరణం- విశ్వ కర్మ
నాల్గవ కిరణం- విశ్వ వ్యచ
ఐదవ కిరణం- సంపద్వసు
ఆరవ కిరణం- అర్వాదము
ఏడవ కిరణం- స్వరాడ్వసు.
✍� సర్వేజనాస్సుఖినోభవంతు .

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...