Friday, January 20, 2017

విద్య కాషాయీకరణా..! అంటే ఏమిటి..?

విద్య కాషాయీకరణా..! అంటే ఏమిటి..?


దేశంలో "జాతీయభావ" వ్యతిరేకశక్తులు చెలరేగిపోతున్నాయి.  ఎప్పుడూ ఏదోఒక అంశం పట్టుకుని రచ్చచేస్తూ ఉండటం వీరి అలవాటు. అదే వారివృత్తి. విద్యను కాషాయీకరణం చేస్తున్నారు, చదువులో మతతత్వాన్ని నింపుతున్నారు అంటూ నానాయాగీ చేస్తున్నారు. ఇంతకూ 'కాషాయీకరణ' అంటే  ఏమిటి? వాస్తవంగానే ఏమైనా దారుణం జరుగుతున్నదా? మనమంతా తెలుసుకోవాలి.

దేశభక్తి, జాతీయశక్తి, భారతీయకరణ అన్నవి మనకేమీ క్రొత్తకాదు. ప్రముఖ నాయకుడు లోకమాన్య తిలక్ 1884లోనే 'డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటి' స్థాపించి విద్యావిధానంలో భారతీయత ఉండాలని, మన గతవైభవం విద్యార్థులకు తెలియచెప్పాలని ఉద్యమించారు. అభినవ ఋషి, తత్వవేత్త, పూర్వాశ్రమంలో విప్లవవీరుడు అయిన అరవిందఘోష్ కూడా తిలక్ ను సమర్థిస్తూ, మొగల్, బ్రిటిష్ పాలనలో భ్రష్ఠుపట్టిన మన విద్యావిధానాన్ని సంస్కరించాలని ఉద్యమించారు. వేదాలూ, భగవద్గీత గత కాలానికి సంబంధించిన శాస్త్రాలు కావనీ, ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండి ప్రజలకు జ్ఞానప్రదానం చేస్తాయని అన్నారు.

భాజపా, ఆర్.ఎస్.ఎస్. వారికి ఇంకో పనేమీ లేదని, సర్వం కాషాయీకరించడమే వీరి లక్ష్యమంటూ గతంలో ఎన్.డి.ఏ. ప్రభుత్వం కూడా ఇలాగే చేసిందని, ఇప్పుడు మోదీ కూడా అదే చేస్తున్నాడంటూ తిట్టిపోస్తున్నారు. నిజానికి సమస్య ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు మొదలైందో తెలిస్తే 'కుట్ర' బయటపడుతుంది. ప్రస్తుతం మన విద్యావిధానం నిస్తేజం, నిర్వీర్యత, నిరాశ, బానిస భావాలతో నింపబడి ఉన్నది. దీనికి మూలం 1835 సంవత్సరంలో లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే అనే ఆంగ్లేయుడు తెచ్చిన 'ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చట్టం - 1835' అనే చట్టంతో మొదలైంది. అప్పటివరకు మనదేశంలో ఉన్న హిందూ విద్యావిధానం (గురుకుల విద్యావిధానం) లోపభూయిష్టంగా ఉన్నదనీ, దీనిని వెంటనే మార్చాలనీ మెకాలే వాదించాడు. ఆనాడు దేశంలో ఉన్న అన్ని 'గురుకులా'లకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం నిలిపివేయించాడు. ఎందుకంటే హిందూవిద్యావిధానంలో మన వైభవం ఏమిటో విద్యార్థులకు అవగతం అవుతుంది. వారిలో స్వాభిమానం అంకురిస్తుంది. విదేశీయుల ఆటలు సాగవు. ఈ స్థితిని నాశనం చేసి బానిసలను ఉత్పత్తి చేసే ఆంగ్ల విద్యను మెకాలే ప్రవేశపెట్టాడు. దురదృష్టం ఏమంటే 1947 తరువాత కూడా ఇదే విధానాన్ని నెహ్రూ కొనసాగించడం. మనం మన పిల్లలకు వాస్తవమైన, సత్యమైన విద్యను బోధించడం తప్పా? గతంలో శత్రువులు చేసిన కుట్రను ఛేదించవద్దా?

పాఠశాలలో 8,9 మరియు 10 తరగతి పుస్తకాలలో, వేదాలు, ఉపనిషత్తులలోని కొన్ని అంశాలు చేర్చాలని శ్రీమతి స్మృతి ఇరానీ (కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి) చేసిన ప్రతిపాదనతో ఈ రచ్చ మొదలైంది.

పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను చూడటం లేదని చాలామంది వాపోతుంటారు. ఎలా చూస్తారు? వారు చదివేదేమో విదేశీ ఇంగ్లీషు చదువు. అమ్మ ప్రేమ తెలియకుండా అమ్మమీద మమకారం ఎలా పెరుగుతుంది. అమ్మ ప్రేమ, దేశభక్తి తెలియాలంటే స్వదేశీ చదువు చదివించడం ముఖ్యం. అందుకే.. కాషాయీకరిస్తాం, అన్నింటినీ కాషాయీకరిస్తాం. ఎందుకంటే.. కాషాయం అంటే త్యాగం, తపస్సు, బలిదానం, మాతృప్రేమ, దేశభక్తి.

ఇవన్నీ తప్పా..! మీరే చెప్పండి..!

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...