Saturday, January 21, 2017

మణిద్వీప వర్ణన - 1

శ్రీ దేవీభాగవతాంతర్గత
మణిద్వీప వర్ణన - 1.
బ్రహ్మలోకానికి పైనసర్వలోకం విరాజిల్లుతూ ఉంటుంది. దానినే మణిద్వీపమంటారు. అక్కడే శ్రీదేవి తేజరిల్లుతూ ఉంటుంది. సమస్తలోకాలకన్న అధికమైనది కావడం వల్లనే మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు. పరాంబికాదేవి దానిని తన సంకల్ప మాత్రంచేత సృష్టించింది. ఈ సృష్టికిపూర్వం మూల ప్రకృతీదేవి ఈ మణిద్వీపాన్ని తనకు ఆవాసస్థానంగా ఏర్పరచుకుంది. మణిద్వీపం కైలాసం కన్నా మిన్నగా, వైకుంఠంకంటే ఉత్తమంగా, గోలోకం కంటే శ్రేష్ఠంగా భాసిల్లుతూ ఉంటుంది. అందుకే దానిని సర్వలోకమంటారు. ఈజగత్రయంలో దానిని అధిగమించిన సుందరతర నగరం వేరొకటి లేదు. అది భువన త్రయానికి ఛత్రంలా అమరి ఉంది. సంసార సంతాపాన్ని నాశనం చేస్తూ అది బ్రహ్మాండాలు అన్నిటికి చల్లని నీడను ప్రసాదిస్తూ ఉంటుంది. గాంబీర్య, వైశాల్యాలలో సమమైన యోజనాలు కలది. మణిద్వీపానికి నాల్గువైపులా అమృతసాగరం భాసిల్లుతూ ఉంటుంది. ఆ సాగరంలో వాయుస్పర్శకు ఉవ్వెత్తుగ లేస్తూ శీతలతరంగాలూ, రతనాల సైకత ప్రదేశాలూ, దక్షిణావర్త శంఖాలూ, అనేక వర్ణాలుకల చేపలూ కనుల పండుగ చేస్తూ ఉంటాయి. అక్కడ అసంఖ్యాక తరంగాల సంచలనం వల్ల చల్లటి నీటితుంపరలూ, తెక్కేల తెక్కుతో అటూ ఇటూ సంచరించే పడవలూ ఆ ప్రదేశాన్ని శోభాయమానం చేస్తుంటాయి. సుదీర్ఘమైన ఆ తీరాలలో నయనానందకరమైన రత్నవృక్ష పంక్తులు రాజిల్లుతూ ఉన్నాయి.
ఆ ప్రదేశానికి ఆవలిభాగంలో నిర్మించబడిన సప్త యోజనాల విస్తీర్ణంకల దృఢమైన లోహమయ ప్రాకారం ఉంది. నానాశస్త్రాస్త్రాలను ధరించి పోరడంలో యుద్ధ విశారదులైన రక్షకభటులు నాలుగు ద్వారాలతో ద్వారపాలకులై కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి ద్వారంలోనుఊ వందలాది భటులుంటారు. అక్కడ శ్రీదేవీభక్తులు గణాలుగానివసిస్తారు. వారు సర్వదా జగదీశ్వరి దివ్య సందర్శనార్థం విచ్చేస్తూంటారు. వారు తమ దివ్య వాహనాలపై వస్తూపోతూంటారు. వారి అసంఖ్యాక విమానాదుల గంటల చప్పుళ్ళూ వారి గుర్రాల సకిలింఉలూ, వాటి డెక్కల టక టక ధ్వనులూ దిక్కులు పిక్కటిల్లేలా మారుమ్రోగుతుంటాయి. అక్కడి దేవీ జనాదులు వేత్ర పాణులై 'గోల చేయకండి' అంటూ దేవ సేవకులను దండిస్తూ ఉంటారు. ఆ మహాకోలాహల మధ్యభాగంలో ఎవరు ఏ చప్పుడు చేసినా తెలియరాదు, ఒకరిమాట వేరొకరికి తెలియరాదు. అక్కడ అడుగడుక్కీ స్వచ్ఛశీతల, మధుర జల సంభరిత సరోవరాలున్నాయి. అచ్చోటనే రత్నమయ వృక్ష సంభరితమైన ఉద్యానవనాలున్నాయి.
ఆ స్థానందాటి పురోగమించగా లోపలిభాగంలో కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంది. ఆ కాంస్యప్రాకారం అంబరాన్ని చుంబించునట్టిదిగా ఉంది. లోహమయ ప్రాకారాన్ని అధిగమించి కాంస్య ప్రాకారం శతాధిక లోహమయ ప్రకారం కన్నమిన్నయై మహత్తరమైనది. దాని గోపుర ద్వారాలు మహోన్నతమైనవి. సమస్త తరుజాతులూ అక్కడ ఉన్నాయి. ఆ తరుశాఖలకు సర్వదా కొంగ్రొత్త చిగుళ్ళను, కమ్మటి సువానలీను నానావర్ణాలుకల పుష్ప గుచ్చాలును, మధుర ఫలాలూ విలసిల్లుతూంటాయి. పనస, వకుళ, లోధ్ర, కర్ణికార, శింశుప, దేవదారు, కాంచనార, చూతనమేరు, లికుచ, హింగులైలా, లవంగ, కట్ఫల, పాటల, ముచుకుంద, ఫలినీ, జఘనేఫల, తాల, తమాల, సాల, కంకోల, నాగభద్ర, పుణ్నాగపీలు, సాల్వక, కర్బూరాశ్వకర్ణ, హస్తికర్ణ, తాలపర్ణ, దాడిమి గణిక, బంధుజీవక, జంబీర, కురండక, చాంపేయ, బంధుజీవన, కనక, ద్రుమ, కాలాగురు, చందన, ఖర్జూర, యూధికా, తాలపర్ణీక్షు, క్షీరవృక్ష, ఖదిర, బింబా, భల్లాత్క, రుచక, కుటజ, బిల్వ, తులసి, మల్లికాది తరువులూ గల మనోహర వనాలూ ఉన్నాయి. ఈ రీతిగా అక్కడ నానావిధ వృక్షాలూ, వనోపవనాలూ, అనేక శతాల సంఖ్యలో దిగుడు బావులూ మహాసుందరంగా భాసిల్లుతూంటాయి. ఆ తరుశాఖలపై ఆసీనులై కోయిలలు కుహూనాదాలు చేయగా గండు తుమ్మెదలు ఝంకార నాదాలు చేయ ఆ నాదాలు శ్రవణ మనోహరంగా ఉంటాయి. ఆ తరువులు సాంద్ర శీతలచ్ఛాయను ప్రసాదిస్తూంటాయి. వివిధపక్షి సముదాయానికి ఆ తరు సమూహాలు నివాసయోగ్యంగా ఉన్నాయి. అనేక రసాల ప్రవహించు నదీతీర ప్రదేశాలు అక్కడ నయనానందకరంగా ఉంటాయి.
చిలుకలూ, గోర్వంకలూ, పావురాలూ, రాజహంసలూ ఆదిగాగల పక్షిపక్ష సంజాత వాయువుల వల్ల అక్కడి తరుశాఖలు కంపిస్తూంటాయి. అట్టి తరు సమూహాలు విరజిమ్మే సుగంధ పవనాల వల్ల అక్కడి వనాలలో పరిమళాలు గుబాళిస్తూంటాయి. ఆ వనాలలోని హరిణీ సమూహాలు బిత్తరి గంతులతో ఇటూ అటూ పరిభ్రమిస్తూంటాయి. అచ్చోట నర్తిస్తూ కేకారవాలు చేసే మనోహర మయూరనాదాలు దశదిశలూ వ్యాపిస్తూంటాయి. అట్టి మణిద్వీపంలో మధుర నాదాలు ప్రతిధ్వనించ మధువును స్రవింపజేసే తరుసమూహాలు అలరారుతుంటాయి.
ఆ కాంస్య ప్రాకారం దాటగా లోపలివైపు తామ్రప్రాకారం ఉంది. చతురస్రాకారంగా ఉన్న అది చత్యంఉరస్రాకారంగా సప్తయోజనాల ఔన్నత్యం కలిగి అది భాసిల్లుతూ ఉంటుంది. కాంస్య తామ్ర ప్రాకారాల మధ్యలో కల్ప వనాలున్నాయి. తరు వికసిత పుష్పాలు సువర్ణ పుష్ప సమంగా భాసిల్లుతూ ఉంటాయి. వాటి పత్రాలు సువర్ణ పత్రాలుగా బీజఫలాలు రత్నాలవలె, సొంపుకూరుస్తూ ఉంటాయి. ఆ తరు బహిర్గత సుగంధం దశయోజన పర్యంతం వ్యాపిస్తూ ఉంటుంది. ఆ కల్పవనంలో వసంతేశుడు కొలువై అహోరాత్రులు వసంత శోభలను వ్యాపింప జేస్తూంటాడు. అతడు పుష్పచ్ఛత్ర ఛాయలో పుష్ప సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. పుష్పాభరణాలను దాల్చిన అతడు పుష్ప మధువును పానంచేసి మత్తెక్కి ఉంటాడు. మధుశ్రీ మాధవశ్రీలు ఇర్వురూ అతని భార్యలు. సదా మందస్మిత వదనారవిందాలతో అలరారే భారలతోకూడి వసంతుడు పూల బంతులతో క్రీడిస్తూంటాడు. మధుధారలు ప్రవహించునట్టి ఆ కల్పక వనం అపారానందాన్ని అందజేస్తూ ఉంటుంది. అక్కడి సుగంధాలు దశయోజన పర్యంతం వ్యాపించి ఉంటాయి. సుగంధ సంభరితమైన ఆ వనాలలో గాన లాలసలైన గంధర్వ కామినీజన గాఢాలింగనాలలో గంధర్వ యువకులు సయ్యాటలాడుతూ ఉంటారు. మత్తకోయిలల కలకలరావాలతో వసంత శ్రీ శోభలతో ఆ దివ్యవనం కముకుల కామోద్రేకాన్ని వర్ధిల్లజేస్తూ ఉంటుంది.
తామ్ర ప్రాకారాన్ని అధిగమించగా లోపలివైపు సీస ప్రాకారం ఉన్నది. సప్తయోజనాల ఎత్తులో అది అలరారుతూ ఉంటుంది. తామ్రసీస ప్రాకారాల మధ్యభాగంలో సంతాన వాటిక ఉంది. అచ్చట దశ యోజన పర్యంతం వ్యాపిస్తూ ఉంటుంది. మధుర రస సంభరితాలై అక్కడి ఫలాలు ఉంటాయి. సంతాన వాటికకు గ్రీష్మ ఋతువు నాయకుడు, శుక్రశ్రీ శుచిశ్రీలు అతని భార్యలు. సంసార తాపభీతలై వారు ఆ తరువలు మొదట శాంతిగ విశ్రమిస్తూంటారు. అక్కడే గణనాతీతంగా అమర, సిద్ధ గణాలు ఉంటాయి. శరీరాలకు గంధాలు పూసుకొని సుమమాలలను గళసీమలో అలంకరించుకుని తాళవృంతాలను చేబూని నవ విలాసినులు సమూహాలుగా ఒయ్యారాన్ని ఒలకబోస్తూంటారు. అచ్చటి ప్రాణులు శీతల జలాలను పానం చేస్తూంటారు.
సీసపు ప్రాకారాన్ని దాటి పురోగమించగా గోచరమయ్యేది ఇత్తడి ప్రాకారము. అది సప్తయోజనాలు ఔన్నత్యం కలిగి విరాజిల్లుతూ ఉంటుంది. సీసపు - ఇత్తడి ప్రాకారాల మధ్య ప్రదేశంలో హరిచందన తరువనాలున్నాయి. మేఘవాహనుడైన వర్షఋతువు దానికి అధిపతి, తటిల్లతలవలె అతని నయనాలు పింగళ వర్ణంలో భాసిల్లుతూ ఉంతాయి. అతడు మేఘ సమూహాలే కవచంగా కలవాడు. వజ్ర సదృశంగా గర్జిస్తూ ఇంద్రచాపధారియై కడవపోతగా సర్వే సర్వత్రా వర్షిస్తూ స్వగణపరివేష్టితుడై ఉంటాడు. నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబాదుల నితంతి, భ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చిపుణిక, వారిధార మదవిహ్వల ఈ పన్నెండుగురు వర్షఋతు నాయకునకు మదమత్తలైన ద్వాదశ శక్తులు, ఈ ప్రదేశమంతా నవపల్లవ సంభరిత తరుపంక్తులతో, లేలేత తీగెలతో, పచ్చని పైరులతో కనుల విందు చేస్తూ ఉంటుంది. నిర్విరామ ప్రవాహవేగంతో అక్కడి నదీనదాలు హృదయానందాన్ని వర్ధిల్లజేస్తూంటాయి. సరస్సులలోని కలుష జలాలు సయితంరాగౌల అంతరంగాలవలె విశుద్ధంగా ఉంటాయి. శ్రీదేవీ మహోత్సవాలు చేసుకునే సిద్ధులూ, దేవతలూ అక్కడ వసిస్తూంటారు. వారు విలాసినులైన తమ పత్నులతో విహరిస్తూంటారు.
ఆ ఇత్తడి ప్రాకారం దాటగా లోపలగా సప్త యోజనాల ఔన్నత్యం కలిగి పంచలోహమయ ప్రాకారం తేజరిల్లుతూంటుంది. ఇత్తడి-పంచలోమయ ప్రాకారాలకు మధ్య భాగంలో మందారవనం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మందార తరువులు సుందర పుష్పాలతో పల్లవాలతో నయనానందకరంగా ఉంటాయి. ఎట్టిరోగమూలేని శరదృతువు దానికి అధిష్ఠాతకాగా ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అనేవారు అతని భార్యలు సిద్ధులు అచ్చోట తమ పత్నులతో నివసిస్తూంటారు.
ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా లోపలవైపు సప్తయోజనాల ఎత్తు కలిగి మహోన్నత శిఖరాలతో రజిత ప్రాకారం తళతళలాడిపోతూంటుంది. అక్కడి పారిజాత తరువులు నవ్యపుష్ప గుచ్ఛాలతో సుగంధాలను వెదజల్లగా తత్పరిమళం దశయోజన పర్యంతం వ్యాపిస్తూ దేవీ పూజలు చేసేవారి ఆనందాన్ని వర్ధిల్లజేస్తూంటుంది. మహోజ్జ్వలైన హేమంత ఋతువు దానికి అధిపతి, అతదు తన గణాలతో, ఆయుధాలతో అనురాగవతుల మనస్సులను పరవశింపజేస్తూంటాడు. సహశ్శ్రీ సహస్యశ్రీలు అతని భార్యలు. దేవీ వ్రతాలను ఆచరించునట్టి సిద్ధులు అక్కడ నివసిస్తూ ఉంటారు.
ఆ రజిత ప్రాకారం దాతి పురోగమించగా లోపలి ప్రదేశంలో సప్తయోజనాల ఔన్నత్యం కల సువర్ణమయ ప్రాకారం తేజరిల్లిపోతూ ఉంటుంది. రజిత-సువర్ణమయ ప్రాకారాల మధ్య పుష్పపల్లవ శోభితమైన కదంబవనం ఉంది. ఆ తరువుల నుండి కదంబ మధ్యం అసంఖ్యాక ధారలతో స్రవిస్తూ ఉంటుంది. ఆ రసధారలను స్వేచ్ఛగా పానం చేయడం వల్ల ఆత్మానందం కలుగుతుంది. ఆ ప్రాకారానికి శిశిర ఋతువు అధిపతికాగా, అతడు తన పత్నులైన తపశ్శ్రీ, తపస్యశ్రీలతో గూడి ఆనందిస్తూంటాడు. ఆ స్థానంలో మహాసిద్ధులైన వారు నానా గణాలతో హావభావ విలాసయుక్తులై దేవీ ప్రీత్యర్థం దానాలు చేయ సంసిద్ధంగా ఉంటారు. వారు తమ అర్థాంగులతో కాపురాలు చేస్తూ సుఖభోగాలు అనుభవిస్తూ సంతోషంగా ఉంటారు.
సువర్ణమయ ప్రాకారాన్ని దాటి ముందుకు వెళ్ళగా లోపలివైపు ఏడు యోజనాల ఎత్తులో పుష్పరాగమణి ప్రాకారం కంటపడుతుంది. ఎర్రటి కుంకుమలా అది భాసిల్లుతూ ఉంటుంది. అక్కడి పృథివీ, వనోపవనాలూ అన్నిటి కన్నీ పుష్పరాగమణి మాయలే. అక్కడ ఉండే రత్నవృక్షాలూ పుష్పరాగపుచెట్ల పాదులూ సొంపుగా ఉంటాయి. అచ్చోటనే రత్నప్రాకారం ఉంది. అందలి తరు, పక్షి, వనభూమ్యాదులన్నీ రత్నమయాలై మండప, స్తంభ, సరోవర, కమలాదులన్నిటికన్నీ రత్నమయాలే. ఈ రత్న ప్రాకారం ఇతరేతర ప్రాకారాలన్నిటినీ మించి లక్షరెట్లు అధికంగా భాసిల్లిపోతూ ఉంటుంది. బ్రహ్మాండంలోని దిక్పతులైన ఇంద్రాదులు, వరాయుధాలు ధరించి దిక్పాల సమష్ట్యాత్మ రూపంలో ప్రకాశిస్తూంటారు.
దానికి తూర్పుగా మహోన్నత శిఖరాలతో అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూ ఉంటుంది. అక్కడ మహేంద్రుడు రాజిల్లుతూ ఉంటాడు. స్వేగసీమలోని శోభకన్న మిన్నయైన అత్యధిక శోభకానవస్తుంది. అక్కడ వేలాది ఇంద్రుల ప్రకాశం కల మహేంద్రుడు వజ్రహస్తుడై దేవసైన్య పరివేష్టితుడై భాసిల్లుతూంటాడు. దేవాంగనలతో కూడి ఇంద్రాణి కూడ అక్కడే విరాజిల్లుతూంటుంది. దానికి ఆగ్నేయ భాగంలో అగ్నిమయ పట్టణ మనదగిన అగ్నిపురం తేజరిల్లిపోతూంటుంది. అగ్నిభట్టారకుడు అక్కడే తన భార్యలైన స్వాహా, స్వధా దేవ్యులతో నిజవాహన భూషణ, దేవగణ పరివేష్టితుడై ప్రకాశిస్తూంటాడు. దక్షిణ దిగ్భాగంలో యముని నగరం ఉంది. అక్కడ యముడు దండపాణియై చిత్రగుప్తాదులతో, తనశక్తితో నివసిస్తూ ఉంటాడు. నైరృతదిశలో రాక్షసులుంటారు. వారిచే పరివేష్టితుడై నిజశక్తి యుక్తుడై నిరృతి భాసిల్లుతూంటాడు. పశ్చిమదిశలో పాశధరుడై వరుణదేవుడు ప్రతాపశాలియై గోచరిస్తాడు. వారుణీ మదమత్తయైన తన పత్నితో మహా మత్సాన్ని అధిరోహించి జలజంతువులతో విహరిస్తూంటాడు. అతడా లోకంలో తన భార్యతో కూడి రతి క్రీడల తేలి ఆనందిస్తూంటాడు. వాయువ్యదిశలో వాయులోకంలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. వాయుసాధనం ద్వారా సిద్ధులైన యోగి జన పరివేష్టితుడై ధ్వజహస్తుడై, విశాలాక్షుడై మృగవాహనుడై మరుద్గణ సేవితుడై తన శక్తితో కూడి ఆ మహాత్ముడు విరాజిల్లుతూంటాడు.
ఉత్తర దిశలో యక్షలోకం ప్రకాశిస్తూంటుంది. అక్కడ వృద్ధి-బుద్ధి అనే పేర్లు గల శక్తులతో యక్షేశుడు భాసిల్లుతూ ఉంటాడు. ధనపతి అయిన అతడు నవనిధులకూ అధిపతి. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, మణికంథరుడు, మణిభూషుడు, మణిమాలాధారి, మణికార్ముకుడు, ఆదిగాగల యక్షసేనానులతో కుబేరుడు తన శక్తితో విశేష సంపన్నుడై తేజరిల్లుతూ ఉంటాడు. దానికి ఈశాన్య భాగంలో మహారుద్రలోకం తేజరిల్లుతూ ఉంటుంది. అమూల్య రత్న నిర్మితమైన అందులో మహారుద్రుడు స్వయంగా భాసిల్లుతూంటాడు. మహోగ్రుడై, దీప్తనయనుడైమూపున అమ్ములపొదిని దాల్చినవాడై, వామహస్తాన ధనువును ధరించి అనేకమంది రుద్రులతో కూడి ఉంటాడు. వారును వరాయుధ ధనుర్ధారులై ఉంటారు. వారి వికృత భయంకర వదనాల నుండి నిప్పులు కురుస్తూంటాయి. వారిలో కొందరు దశభుజులు, మరికొందరు శతభుజులు, ఇంకా కొందరు సహస్ర భుజులు, దశపాదాలతో, దశగ్రీవాలతో నేత్రత్రయంతో కొందరు ఉంటారు. భీకర రూపులైన వారిలో కొందరు పృధ్విమీద, మరికొందరు అంతరిక్షంలోనూ పరిభ్రమిస్తూంటారు. రుద్రాధ్యాయంలో వర్ణించిన రుద్రులచే, మాతలచే, నానాశక్తులచే, డామర్యాది గణాలచే, వీరభద్రాదులచే పరివేష్టితుడై మహారుద్ర భగవానుడు తేజరిల్లుతూంటాడు. ముండమాలాధరుడు, నాగకంకణుడు, నాగకంటుడు, వ్యాఘ్రచర్మధారీ, గజచర్మాన్ని ఉత్తరీయంగా ధరించినవాడూ, చితాభస్మధారీ ప్రమథగణ పరివేష్టితుడూ, డమరుకనాదాలను దశదిశలా ప్రతి ధ్వనింపజేయగలవాడూ, మహాట్టహాస, స్ఫోట శబ్దాలతో నభాన్ని భయపెట్టినట్టివాడూ, భూత సంఘాలతో కూడిన వాడూ, భూతావాసుడూ అయిన మహేశ్వరుడు ఈశానాది అధిపతికావడం వల్ల ఈశానాది అధిపతి కావడం వల్ల ఈశానుడనబడతాడు. అష్ట మూర్తియు, మహారుద్రుడూ అయి అతడు భాసిల్లుతూంటాడు.
పుష్యరాగమణుల ప్రాకారానికి ఆవలి భాగంలో లోపల కుంకుమ సమ అరుణవర్ణంతో పద్మరాగ మణి ప్రాకారం భాసిల్లుతూంటుంది. అక్కడి భూభాగం కూడ ఎర్రగానే ఉంటుంది. ఆ ప్రకారం దశయోజనాల ఔన్నత్యం కలిగి ఉంటుంది. దానికి గోపుర ద్వారాలున్నాయి. అక్కడ పద్మరాగమణి సంభరిత ప్రకాశంతో అసంఖ్యాక మండపాలున్నాయి. వాటి నడుమ వివిధాయుధ, రత్నభూషణ ధారులైన వీరులూ, చతుష్షష్టి కళలూ ఉన్నాయి. ఆ మహావీరులకు వేర్వేరుగా నాయకులూ ఉన్నారు. ప్రత్యేక లోకాలూ ఉన్నాయి. ఆ లోకాలన్నీ పద్మరాగమణి నిర్మితాలే. ఆయా లోకాలలోని వారు ఆయా వస్త్ర వాహనాదులను ధరిస్తారు. వారి నామాలు పింగళాక్షి, విశాలాక్షి సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహా, స్వధా, అభిఖ్య, మాయ, సంజ్ఞ, వసుంధర, లోకదాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్య, మాత, సతి, హంసి, మర్దిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లొంబోష్ఠి, ఊర్థ్వకేశి, బహు, శీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమథన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచి, వ్రత, ఉదార, వాగీశి అనే అరువది నాలుగు కళలూ శక్తులనబడతాయి. వారందరికీ నిప్పులు కక్కునట్టి మహోజ్జ్వలమైన జిహ్వలున్నాయి. వారి అనేక ముఖాల నుండి అగ్ని జ్వాలలు బహిర్గతమవుతుంటాయి. "మనం ఈ సమస్త జలాలనూ పానం చేసివేద్దాము. సమస్తాగ్నినీ చల్లార్చి వేద్దాము. వాయువునంతటినీ స్తంభింప జేసివేద్దాము. సర్వజగాలనూ భక్షించి వేద్దాము", అని జేవురించిన నేత్రాలతో వారు అరుస్తూంటారు. ధనుర్బాణ పాణులై వారందరూ కయ్యానికి కాలు దువ్వుతుంటారు. వారి దంత తాడనం వల్ల పుట్టిన కఠోరశబ్దాలకు శ్రవణాలు బదహిరీ భూతమవుతూంటాయి. ఆ మహావీరులందరికీ ఊర్ధ్వ కేశాలున్నాయి. లక్ష బ్రహ్మాండాలను నాశనం చేయగల శక్తి అందులో ప్రతిశక్తికీ ఉంది. అట్టి నూర్ల అక్షౌహిణీ సైన్యాలున్నాయి. ఈ విశ్వంలో వాటికి అసాధ్యమైన దేదీలేదు. ఆ ప్రాకారంలోనే రణసామాగ్రి అంతా భద్రపరచబడి ఉంది. అచ్చోట రథాశ్వ గజశస్త్రాదులు గణనాతీతంగా ఉన్నాయి.
ఆ పద్మరాగ మణిప్రాకారాన్ని దాటి పురోగమించగా లోపలి ప్రదేశంలో గోమేధిక మణి నిర్మిత ప్రాకారం అలరారుతూ ఉంటుంది. అది దశయోజనాలు ఔన్నత్యం కలిగి రాజిల్లుతూ ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా అది తేజస్సులను విరజిమ్ముతూ ఉంటుంది. దాని మధ్య భాగమందలి భూమీ, అక్కడ ఉండేవారు ఆ వర్ణంతోనే ఉంటారు. అక్కడి భవనాలూ గోమేధిక మణికాంతులను ప్రసరింపజేస్తూంటాయి. అక్కడ నివసించే పక్షి, వృక్ష, స్తంభ, సరోవరాదులన్నిటికన్నీ కుంకుమ సమ అరుణ వర్ణంతో గోమేధికమణి నిర్మితమై ఉంటాయి. ఆ ప్రాకార మధ్య భాగంలో ముప్ఫై రెండు శ్రీదేవీ శక్తులుంటాయి. గోమేధికాభరణ ధారులైన ఆ శక్తులు వివిధ శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తూంటారు. ఆ ప్రాకారంలో 32లోకాలున్నాయి. ప్రతిలోక శక్తికీ దశసంఖ్యలో అక్షౌహిణీ సైన్యాలున్నాయి. ఆ ప్రాకారంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో, నిరంతర చక్రధారిణులై సదా స్వర్గవాసులచే ఆరాధింపబడుతూంటారు. క్రోధోద్రిక్తలైనవారు "ఛేదించండి, భేదించండి, వండండి, కాల్చండి" అని అంటూ నిరంతర యుద్ధోత్సాహంతో సంసిద్ధంగా ఉంటారు. ప్రతీ మహాశక్తి సన్నిధిలోనూ దశాక్షౌహిణీ సైన్యాలుంటాయి. అందలి ప్రతీశక్తి అగణిత బ్రహ్మాండాలనైనా నాశనం చేయగలదు. అట్టి మహాసైన్యాలను వర్ణించగలమా? అక్కడ ఉన్న రథ వాహినులకు లెక్కయేలేదు. వారందరికందరూ శ్రీదేవికై యుద్ధం చేయ సన్నద్ధులై ఉంటారు. పాపహారకాలైనా వారి నామాలివి. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహూ, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, శుంభ, నిశుంభమథిని, మహిషాసురమరద్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థశరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, మాయాదేవి వీరేక్రుద్ధులయైతే సమస్త బ్రహ్మాండాలనూ నాశనం చేయగలరు. ఎట్టి స్థితిలోనూ వీరు అపజయాన్ని అంగీకరించరు.

,(తనుగుల సందీప్ సౌజన్యంతో)

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...